చండీఘఢ్ : పంజాబ్ కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధిగా ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పేరును పార్టీ అగ్రనాయకత్వం ప్రకటించినప్పటి నుంచి కినుక వహించిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ అంశంపై నోరుమెదిపారు. పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత పోరు లేదని, చన్నీని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నేతలందరూ స్వాగతిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్లో అంతర్గత పోరు ఎక్కడ ఉందని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్లో సిద్ధూ ప్రశ్నించారు. రాహుల్ నిర్ణయాన్ని తామంతా స్వాగతించామని, హైకమాండ్ నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన చెప్పుకొచ్చారు. పంజాబ్ సీఎం అభ్యర్ధిగా సిద్ధూ చివరివరకూ పార్టీ రేస్లో నిలిచారు. సిద్ధూను సీఎం అభ్యర్ధిగా ప్రకటించకపోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే సిద్ధూను హైకమాండ్ సూపర్ సీఎం చేస్తుందని పార్టీ ఎంపీ రణ్వీత్ సింగ్ బిట్టూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రతి పేద పంజాబీ చన్నీ కోసం గురుద్వారాలు, ఆలయాల్లో ప్రార్ధనలు చేస్తున్నారని ఆయన చెప్పారు.
చన్నీ మరోసారి సీఎం పగ్గాలు చేపడితే పేదలందరూ తమ పిల్లలు కూడా బాగా చదువుకుని ఏదో ఒకరోజు సీఎం అవుతారని ఆశిస్తున్నారన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 14, 16, 17 తేదీల్లో పలు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనుండగా మోదీ టూర్ను బహిష్కరించాలని రైతులు యోచిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 14న జలంధర్లో తొలి ర్యాలీలో పాల్గొననుండగా, 16న పఠాన్కోట్, 17న అబోహర్లో ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని పంజాబ్లో పర్యటించదలుచుకుంటే ఆయన హెలికాఫ్టర్ లేదా విమానాల్లో ప్రయాణించాలని, రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటే ఆయనకు నిరసన సెగలు తప్పవని కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టూ స్పష్టం చేశారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏడాది పాటు రోడ్లపై గడిపిన విషయాన్ని పంజాబీలు మరువలేదని అన్నారు. రైతుల నిరసనల్లో అన్నదాతలకు ఎదురైన ఇబ్బందులను వారు ఎలా మరిచిపోతారని బిట్టూ నిలదీశారు. నిరసనల్లో దాదాపు 700 మందికి పైగా రైతులు మరణించారని గుర్తుచేశారు. కాగా గత నెలలో పంజాబ్లోని ఫిరోజ్పూర్లో రైతుల ఆందోళనలతో ప్రధాని మోదీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్పై నిలిచిపోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పంజాబ్ ప్రభుత్వ తీరును తప్పుపట్టగా భద్రతా వైఫల్యంపై రిటైర్డ్ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా నేతృత్వంలో దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వేర్వేరుగా దర్యాప్తు కమిటీలను ఏర్పాటు చేసి విచారణను సాగిస్తున్నాయి.