బెంగుళూరు: కర్నాటక రాష్ట్రానికి చెందిన నవీన్ శేఖరప్ప .. ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరంపై జరిగిన దాడిలో మృతిచెందిన విషయం తెలిసిందే. బెకెటోవ్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ కింద షెల్టర్లో ఉన్న నవీన్ శేఖరప్ప సరుకులు కొనేందుకు బంకర్ నుంచి బయటకు వెళ్లి బాంబు దాడిలో మృతిచెంచాడు. ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగి ఇవాళ్టికి 12 రోజులు గడిచాయి. కానీ నవీన్ మృతదేహం మాత్రం ఉక్రెయిన్లోనే ఉన్నది. దీనిపై ఇవాళ కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై మాట్లాడారు. నవీన్ శేఖరప్ప మృతదేహానికి ఎంబాల్మింగ్ జరిగిందని, అక్కడే మార్చురీలో ఆ మృతదేహాన్ని ఉంచినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పినట్లు సీఎం బొమ్మై వెల్లడించారు. కాల్పుల మోత ఆగిన తర్వాత నవీన్ పార్దీవదేహాన్ని ఇండియాకు తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలోని హవేరీ జిల్లా రణబెన్నూర్ తాలూకా చలగేరి గ్రామం నవీన్ స్వస్థలం. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో గత నాలుగేళ్లుగా అతను ఎంబీబీఎస్ చదువుతున్నాడు.