Wrestlers Protest | న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పోలీసులు ఈడ్చి పారేసినా… కేంద్రం దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించినా కుస్తీ యోధులు తమ పట్టు వీడలేదు. హృదయాలు కలత చెందినా.. సహనానికి పరీక్ష ఎదురవుతున్నా.. న్యాయం కోసం సుదీర్ఘ పోరాటానికే సిద్ధమయ్యారు. ఆత్మ గౌరవమే తమకు ముఖ్యమని, తమ పోరాటంలో ప్రాణాలైనా వదిలేస్తామని తెలిపారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై మోదీ సర్కార్ చర్యలు తీసుకోకపోతే ఆమరణ దీక్షకూ సిద్ధమని ప్రకటించారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తమకు, దేశానికి కీర్తి తెచ్చి పెట్టిన పతకాలను గంగలో నిమజ్జనం చేయడానికి ప్రయత్నించారు. మరోవైపు రెజ్లర్ల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ, ప్రస్తుత ప్రముఖ క్రీడాకారులు ఢిల్లీ పోలీసుల దురుసు ప్రవర్తనపై, కేంద్రం వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రెజ్లర్ల పోరాటానికి తమ మద్దతు తెలిపారు. దీంతో ఇప్పటికే రైతు సంఘాలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతుతో ముందుకు సాగుతున్న మహిళా రెజ్లర్ల పోరాటం మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు రూపమైన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సాక్షిగా తమ నిరసన దీక్షపై కేంద్రం సాగించిన దమన కాండపై రెజ్లర్లు ఆవేదన చెందారు. తాము సాధించిన పతకాలను గంగలో కలిపేయడానికి ప్రయత్నించారు. మంగళవారం సాయంత్రం రెజ్లర్లు హరిద్వార్లోని హరికీ పౌరీ ఘాట్ వద్ద పతకాలను నిమజ్జనం చేయడానికి ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని రైతు నేత నరేశ్ టికాయిత్ వారించి, పతకాలను వారి వద్ద నుంచి తీసేసుకున్నారు. టికాయిత్ విజ్ఞప్తి మేరకు పతకాల నిమజ్జనాన్ని రెజ్లర్లు అయిదు రోజుల పాటు వాయిదా వేశారు. రెజ్లర్లకు మద్దతుగా వందలాది మంది అభిమానులు, రైతులు, స్థానికులు హరిద్వార్కు తరలి వచ్చారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రెజ్లర్లు డిమాండ్ చేశారు. కేంద్రం దిగి రాకపోతే ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆమరణ దీక్ష కొనసాగిస్తామని ప్రకటించారు. బ్రిజ్ భూషణ్పై చర్యలు కోరుతూ బుధవారం ఖాప్ పంచాయత్ నిర్వహిస్తామని రైతు నేతలు తెలిపారు. మంగళవారం ఉదయం కేంద్ర ప్రభుత్వ తీరుపై ట్విట్టర్ వేదికగా స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను చూసి వ్యవస్థ భయపడుతున్నదన్నారు. ‘ఈ పతకాలే మా ప్రాణాలు, ఆత్మలు. వాటిని గంగలో నిమజ్జనం చేశాక మేం జీవించడానికి అర్థం ఉండదు. కాబట్టి చావు వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తాం’ అని రెజ్లర్లు ప్రటించారు. కేంద్రం మొత్తం ఒక వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నదని టికాయత్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇండియా గేట్ జాతీయ స్మారక చిహ్నమైనందున అక్కడ అమరణ దీక్షకు అనుమతి ఇవ్వమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.
బ్రిజ్ భూషణ్ రక్షణకు ఇంకెంత దూరం వెళ్తారు?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీని రక్షించడానికే కేంద్రం రెజ్లింగ్ క్రీడాకారులపై విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. బ్రిజ్ భూషణ్ను రక్షించడానికి కేంద్రం ఎందుకు ఇంత దూరం వెళుతున్నదని ఆయన ప్రశ్నించారు. ఆయనకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. రెజ్లర్లు తమ పతకాలను గంగలో వదిలేయాలనుకోవడం దేశానికి సిగ్గుచేటని కేటీఆర్ ట్విట్టర్లో ఆందోళన వ్యక్తం చేశారు.
దేశానికి సిగ్గు చేటు : మాన్
పతకాలు నిమజ్జనం చేసే పరిస్థితి రావడం దేశానికి సిగ్గు చేటని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ట్వీట్ చేశారు. రెజ్లర్ల విషయంలో దేశం కన్నీరు కారుస్తున్నదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆవేదన చెందారు. రెజర్లకు మద్దతుగా కోల్కతాలో ర్యాలీ నిర్వహిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమత వెల్లడించారు. రెజ్లర్లని కూతుళ్లని పిలిచే మోదీ వారు కోరుతున్న న్యాయాన్ని అందించలేరా అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. రెజ్లర్లతో ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించి ఉండాల్సింది కాదని మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, జావెలిన్ త్రోలో ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఈ కష్ట సమయంలో న్యాయం కోరుతున్న రెజ్లర్లకు మనం అండగా నిలవాలని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పిలుపునిచ్చారు. రెజ్లర్లను పోలీసులు ఈడ్చి పారేయడంపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామని టీఎంసీ తెలిపింది. బ్రిజ్ భూషణ్పై మైనర్ రెజ్లర్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసును ఏ కోర్టు విచారణ చేయాలన్న విషయాన్ని తాము నిర్ణయిస్తామని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది. తదుపరి విచారణను జులై 6న చేస్తామంది.