న్యూఢిల్లీ: అమరవీరులకు నివాళిగా నిలుస్తున్న అమర్ జవాన్ జ్యోతిని ఆర్పేస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద జ్యోతితో ఇవాళ కలపనున్నట్లు చెప్పింది. అమర్ జవాన్ జ్యోతిని ఆర్పడం లేదని, దాన్ని జాతీయ యుద్ధ స్మారకంతో కలుపుతున్నామని, అమర్ జవాన్ జ్యోతి వద్ద కేవలం 1971 యుద్ధంలో మరణించిన సైనికుల పేర్లు మాత్రమే ఉన్నాయని, ఇతర యుద్ధాల్లో మరణించిన అమరుల పేర్లు లేవని కేంద్రం చెప్పింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ అమర సైనికులకు నివాళిగా బ్రిటీషర్లు ఇండియా గేట్ను నిర్మించారని, అది కేవలం బ్రిటీష్ పాలనకు చిహ్నంగా ఉన్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
అన్ని యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన అమర సైనికుల పేర్లతో పాటు 1971 యుద్ధంలో అమరులైన వారి పేర్లను జాతీయ యుద్ధ స్మారకం వద్ద చేర్చినట్లు కేంద్రం తెలిపింది. అందుకే జాతీయ యుద్ధ స్మారకమే అరుమరులకు అర్పించే నిజమైన శ్రద్ధాంజలి అని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఏడు దశాబ్ధాల నుంచి జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించలేకపోయిన పార్టీలు ఇప్పుడు నిజమైన నివాళి అర్పిస్తుంటే మొసలి కన్నీరు కారుస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.