లండన్: భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే అమెరికా పర్యటన ముగించుకున్న ఆయన ఇవాళ లండన్ చేరుకున్నారు. రెండు దేశాల మధ్య ప్రతి ఏటా జరిగే వార్షిక వ్యూహాత్మక చర్చల్లో పాల్గొనేందుకు దోవల్ లండన్కు వెళ్లారు. మరికొన్ని గంటల్లో బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు టిమ్ బారో, అజిత్ దోవల్ మధ్య భేటీ జరగనుంది.
ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా బ్రిటన్కు చెందిన బీబీసీ ఛానెల్.. గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీని రూపొందించిన అంశంపై వాడివేడి చర్చ జరగనుంది. భారత ప్రధానికి వ్యతిరేకంగా బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించడాన్ని దోవల్ తీవ్రంగా ఖండించనున్నారు. అదేవిధంగా సోకాల్డ్ ఖలిస్థాన్ ఉద్యమానికి, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి బ్రిటన్ వేదికగా మారుతుండటంపై దోవల్ ప్రశ్నించనున్నారు.