నిర్మల్ జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ జయంత్రావు చౌహాన్
నిర్మల్ టౌన్, మార్చి 31 : రోజురోజుకూ పెరిగిపోతున్న విద్యుత్ వినియోగం నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా తమ పంపుసెట్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలని నిర్మల్ జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ జయంత్రావు చౌహాన్ సూచించారు. విద్యుత్ను నాణ్యతగా, నమ్మకంగా అందించేందుకు విద్యుత్ శాఖ కృషిచేస్తున్నదన్నారు. శాఖ కార్యాలయంలో బుధవారం ఏఈలతో మాట్లాడారు. ప్రతి మండలంలో వ్యవసాయ మోటర్లకు రైతులు స్వచ్ఛందంగా కెపాసిటర్లను అమర్చుకోవాలన్నారు. మార్కెట్లో కేవలం రూ.300-రూ.400 లోపే లభిస్తాయని తెలిపారు. వీటి వినియోగం వల్ల విద్యుత్ పొదుపుగా వాడడమే కాకుండా హెచ్చుతగ్గులు, విద్యుత్ సాంకేతిక సమస్య ఏర్పడదన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ఏఈవోలకు సూచించారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 62 వేలకు పైగా విద్యుత్ మోటర్లు ఉన్నాయని, ఇప్పటివరకు 20 వేల మోటర్లకు మాత్రమే రైతులు కెపాసిటర్లు అమర్చుకున్నారని సిబ్బందికి తెలిపారు.