న్యూఢిల్లీ : కేరళలో నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్-2022 పరీక్షకు హాజరైన అనేక మంది విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. పరీక్షకు హాజరైన విద్యార్థినుల లో దుస్తులను బలవంతంగా విప్పించి.. ఆ తర్వాత పరీక్షకు అనుమతించిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని ఎన్టీఏను ఆదేశించింది. ఈ ఘటన సిగ్గుచేటని, ఆడబిడ్డల గౌరవాన్ని కించపరిచేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ యూజీ-2022 పరీక్ష ఈ నెల 17న దేశవ్యాప్తంగా 550కిపైగా నగరాల్లో జరిగింది. పరీక్షకు 18.72లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో దాదాపు 10లక్షల మంది వరకు బాలికలే ఉన్నారు.
అయితే, పరీక్ష సందర్భంగా కేరళలోని కొల్లంలో ఉన్న ఓ ప్రైవేట్ పరీక్షా కేంద్రంలో సిబ్బంది విద్యార్థినులు లోదుస్తులను తీసివేయాలని, ఆ తర్వాతే పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక వాటిని తీసివేసి పరీక్షకు రాశారు. ఈ అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. తాజాగా జాతీయ మహిళా కమిషన్ దృష్టి సారించి.. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థినుల ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ (NCW) చైర్పర్సన్ రేఖా శర్మ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చైర్మన్ వినీత్ జోషికి లేఖ రాశారు. ఈ విషయంపై కాలపరిమితితో నివేదిక ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కమిషన్ ఆదేశించింది.