న్యూఢిల్లీ, జూలై 14: యమునా నది కాస్త నెమ్మదించినా శుక్రవారం మళ్లీ వర్షాలు కురవడంతో దేశ రాజధాని ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. దహన సంస్కరాలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం వరద సుప్రీంకోర్టు ప్రవేశ ద్వారం వద్దకు చేరుకుంది. మరోవైపు డ్రైన్ రెగ్యులేటర్లో పూడిక తీయకపోవడంతో వరద వెనక్కి మళ్లి కొన్ని ప్రాంతాలు వరదకు గురయ్యాయి. వరదలో స్నానం చేయడానికి వెళ్లిన ముగ్గురు బాలలు కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు.
మరమ్మతులపై మాటల యుద్ధం
ఢిల్లీలో వరదల నియంత్రణపై మీడియా ముందే ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి, జల బోర్డ్ చైర్మెన్ సౌరభ్ భరద్వాజ్, ఎల్జీ వీకే సక్సేనా మాటల యుద్ధానికి దిగారు. ఐటీవో ప్రాంతంలో దెబ్బతిన్న డ్రైన్ రెగ్యులేటర్ మరమ్మతు కోసం గురువారం రాత్రే ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సాయం కోరామని, కానీ వారు స్పందించలేదని… ఫలితంగా శుక్రవారం ఆ ప్రాంతం వరద ముంపునకు గురైందని సౌరభ్ ఆవేదన వ్యక్తం చేశారు.
వరదల వల్ల భారీగా పంట నష్టం
వరదల కారణంగా పంజాబ్, హర్యానాల్లో భారీగా పంట నష్టం జరిగింది. 2.40 లక్షల హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగి ఉండొచ్చని పంజాబ్ ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. మరోవైపు శువ్రారం కురిసిన వర్షం ముంబైను కుదిపేసింది. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బీజేపీ ప్రాయోజిత వరదలివి…
హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ ఆనకట్ట నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేయడం వల్లే ఢిల్లీ వరద గుప్పిట్లో చిక్కుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ‘మూడు రోజులు ఢిల్లీలో వర్షాలు కురవకున్నా వరదకు కారణమేమిటి? మోదీ మనసులోని ద్వేషం ఇలాంటి సందర్భాల్లోనే బయటకు వస్తుంది.’ అని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.