Sitaram Yechury | మోదీని గద్దె దింపితేనే దేశానికి రక్షణ అని, అందుకోసం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ లౌకిక శక్తులను ఏకం చేయాలని సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఆ బాధ్యత ఉభయ కమ్యూనిస్టులపై ఉందని అన్నారు. హైదరాబాద్లో జరిగిన సీపీఎం, సీపీఐ ఉమ్మడి సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కమ్యునిస్టు ఉద్యమానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ సీపీఎం, సీపీఐ చేస్తున్న కృషి అభినందించారు. తెలంగాణలో మొదలైన ఈ ఐక్యత దేశానికి దిక్సూచిగా ఉంటుందని, లౌకిక శక్తులన్నీ ఏకమయ్యేందుకు దోహదపడుతుందని ఆకాంక్షించారు. బీజేపీ మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు.
మోదీ చెబుతున్న అభివృద్ధి మాటల్లో తప్ప చేతల్లో లేదని విమర్శించారు. ప్రజల సొమ్ముతో చేస్తున్న కార్యక్రమాలు ఆర్భాటంగా ప్రారంభిస్తూ.. నేను తప్ప ఎవరూ చేయలేరని మోదీ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో ఏ ప్రధానమంత్రి ఇలా చేయలేదన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం కూని అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ కుంభకోణానికి సమాధానం చెప్పకుండా పార్లమెంట్ను కేంద్రం అడ్డుకుందని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా మాట్లాడుతూ రాజ్యాంగానికి ప్రమాదకారిగా మారిన ఆర్ఎస్ఎస్, బీజేపీ కూటమిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని, ఆ శక్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు. మనుస్మృతి అమలు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు.