బెంగళూరు, మార్చి 8: భూమిపై పరిణామాలను నిత్యం పరిశీలించి తక్షణం సమాచారాన్ని అందించే నిసార్ ఉపగ్రహాన్ని అమెరికా వైమానిక దళం బుధవారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు బెంగళూరులో అందజేసింది. అమెరికాకు చెందిన నాసా, భారత్కు చెందిన ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ నిసార్ రెండు దేశాల అంతరిక్ష సహకారానికి మైలురాయిగా నిలుస్తుందని చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ వ్యాఖ్యానించారు.
నిసార్లో రెండు వేర్వేరు రాడార్లు ఉంటాయి. లాంగ్ రేంజ్ రాడార్ను అమెరికా, ఎస్-బ్యాండ్ రాడార్ను భారత్ శాస్త్రవేత్తలు రూపొందించారు. తర్వాత వీటిని అమెరికాలోని జెట్పాపుల్సన్ ల్యాబరేటరీకి పంపి ఏక యూనిట్గా మార్చారు. అక్కడి నుంచి దీనిని విమానంలో భారత్కు తరలించారు. ఈ ఉపగ్రహాన్ని భూమిపై వాతావరణంలో జరిగే నిగూఢ మార్పుల శోధనకు ఉపయోగిస్తారు.
దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్న సమయంలోనూ వాతావరణంలోని మార్పులను పసిగట్టి తెలియజేయగల సత్తా దీని సొంతం. అంతేకాకుండా ఇది భూ ఉపరితలం, మంచుగడ్డలు ఉన్న ప్రాంతాలలో జరిగే కదలికలను పసిగడుతుంది. పర్యావరణ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. వ్యవసాయ మ్యాపింగ్కు, కొండచరియలు అధికంగా ఉండే ప్రాంతాలలోని పరిస్థితుల అంచనాకు సైతం దీనిని వినియోగించాలని ఇస్రో భావిస్తున్నది. ఈ ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది ఏపీలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్టు ఒక అధికారి తెలిపారు.