Narmada River : ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా నర్మదా నది (Naramada River) లోకి ఏకంగా 11 వేల లీటర్ల పాలను పోశారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం సీహోర్ జిల్లా (Seahore district) లోని భైరుందా గ్రామం (Bhairuna village) వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. స్థానిక ప్రజలతోపాటు జలచరాలకు ఈ చర్య ప్రమాదకరమని హెచ్చరించారు.
భైరుందా గ్రామంలో ఇటీవల 21 రోజులపాటు ఓ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నదిలోకి 11 వేల లీటర్ల పాలను వదిలారు. అయితే నదిలోని నీటి స్వచ్ఛత కోసం ప్రార్థనలు చేసి, ఆ తర్వాత ట్యాంకర్లతో తెచ్చిన పాలను నర్మదకు సమర్పించడం ద్వారా ఆ నీటిని కలుషితం చేయడం గమనార్హం. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు.
నదిలో కలిసిన పాలు సేంద్రియ కాలుష్య కారకంగా మారి నీటిలో ఆక్సిజన్ క్షీణిస్తుందని తెలిపారు. దాంతో నర్మద నీటిపై ఆధారపడిన స్థానికులతోపాటు, ఆ నీటిలోని జలచరాలు ఇబ్బందిపడే ప్రమాదముందని పర్యావరణవేత్త అజయ్ దూబే చెప్పారు.