బెంగళూరు, మే 10: జ్ఞానాన్ని, శాంతిని, ఆశను మానవాళికి అందించే భారతదేశపు సంప్రదాయానికి గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఒక సజీవ ప్రతిరూపంగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. దేశవిదేశాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ‘45 సంవత్సరాల’ వేడుకల్ని ప్రధాని మోదీ ఆదివారం బెంగళూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సామాజిక, ఆధ్మాత్మిక కార్యక్రమాలను ప్రధాని కొనియాడారు.
స్పష్టమైన సంకల్పం, సేవా స్ఫూర్తితో చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుందని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధాన్య మందిరాన్ని ప్రధాని ప్రారంభించారు. రాబోయే తరాల్లో వేలాది మందికి శాంతి, ప్రశాంతతను చేకూర్చే కేంద్రంగా ఇది నిలుస్తుందని నమ్ముతున్నా అని అన్నారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు ప్రజల్లో అనుబంధం, ఐక్యత, సామూహిక బాధ్యత అనే భావనలను బలపరుస్తాయి’ అని ప్రధాని అన్నారు.