న్యూఢిల్లీ : ఎల్పీజీ సిలిండర్ల ధరను సిలిండర్కు రూ 25 పెంచడం పట్ల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం నరేంద్ర మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఎల్పీజీ ధరను పెంచుతూ మోదీ సర్కార్ సామాన్యుల జేబుకు చిల్లు పెడుతూ డబ్బు దండుకుంటోందని ఆమె దుయ్యబట్టారు. ఉజ్వల స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా వంట గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి నిధులను పెంచుకుంటోందని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
ఈ ఏడాది జులై 1న ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ 25 పెంచిన మోదీ ప్రభుత్వం మళ్లీ ఆగస్ట్ 17న రూ 25 భారం మోపిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ 25 పెంచిన నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజా పెంపుతో ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర ఏకంగా రూ 859కి ఎగబాకింది.