Congress | పంజాబ్లో ప్రధాని మోదీకి భద్రతా సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే. ఫిరోజ్పూర్ బహిరంగ సభకు వెళ్తున్న సమయంలో రహదారిపై ప్రధాని మోదీని రైతులు అడ్డుకున్నారు. దీంతో 20 నిమిషాల పాటు మోదీ కాన్వాయ్ నడి రోడ్డుపై నిలిచిపోయిన విషయం విదితమే. ఈ విషయంపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే తీవ్రంగా స్పందించారు. అదంతా ఓ డ్రామా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి సమస్యను సృష్టించుకున్నారని ఆరోపించారు. ఫిరోజ్పూర్ ర్యాలీకి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కాలేదని, ఈ సంఘటన నుంచి దృష్టి మరల్చడానికే అలా చేశారని ఆయన విమర్శించారు.
ప్రధాని మోదీయే స్వయంగా ఎస్పీజీ ప్రోటోకాల్ను ఉల్లంఘించారని, ఆయన ప్రాణాలను ఆయనే ఫణంగా పెట్టుకున్నారని నానా పటోలే వ్యాఖ్యానించారు. ‘స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ముందుగా సూచించిన రూట్లోనే ప్రధాని మోదీ పర్యటించాలి. కానీ.. ఫిరోజ్పూర్ బహిరంగ సభలో కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయని ఆయనకు సమాచారం అందింది. దీంతో ప్రధాని మోదీ డ్రామాకు తెరదీశారు. ఆయనకు అది అలవాటే. మోదీయే రూట్ను మార్చేశారు. సెక్యూరిటీ సమస్యను కొనితెచ్చుకున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పంజాబ్ సీఎం రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నిజం చెప్పాల్నంటే ఎస్పీజీ నియమ నిబంధనలను మోదీ ఉల్లంఘించారు. అందుకే ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం’ అంటూ నానా పటోలే వ్యాఖ్యానించారు.