న్యూఢిల్లీ, నవంబర్ 26: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్నెస్ కేంద్రాల పేరు మారనుంది. ఇక నుంచి వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా పిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ‘ఆరోగ్యం పరమం ధనం’ అని ట్యాగ్లైన్గా పెట్టారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ శనివారం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. దేశంలో 1.6 లక్షల ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్నెస్ కేంద్రాలున్నాయని, ఇక నుంచి వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లుగా పిలువనున్నట్టు పేర్కొంది. గత ఐదేండ్లుగా ఈ కేంద్రాలను దేశంలోని అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామని, వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలు, మందులు, పరీక్షా కేంద్రాలు, వైద్య, వైద్యేతర సిబ్బందిని కూడా సమకూర్చామని తెలిపింది. ఆయుష్మాన్ భారత్ సెంటర్లలో ఇటీవల సమకూర్చిన సదుపాయాలు, సేవలకు సంబంధించి చిత్రాలు, వివరాలను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.