BRS | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్కు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణ మాడల్ను మహారాష్ట్రలోనూ అమలు చేస్తామంటూ తన ఎజెండాను ప్రజల ముందు పెట్టిన బీఆర్ఎస్ను విశేషంగా ఆదరిస్తున్నారు. గత నెల 22న మొదలుపెట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఇప్పటి వరకు 3.50 లక్షల మంది సభ్యత్వం పూర్తయ్యింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 22 వరకు కొనసాగనున్నది. అప్పటి వరకు మరింత ఎక్కువ సంఖ్యలో సభ్యత్వ నమోదు జరుగుతుందని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం తెలిపారు. కిసాన్ సెల్ ద్వారానే ఇప్ప టి వరకు 2 లక్షల వరకు సభ్యత్వాలు పూర్తి చేసినట్టు మీడియాకు వెల్లడించారు. ఇతర సంఘాల ద్వారా 1.50 లక్షల సభ్యత్వాలు ఇచ్చినట్టు వివరించారు.
మహారాష్ట్రలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాగ్పూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాగ్పూర్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ రూపేష్ పన్నాసే, నాగపూర్ సౌత్ అసెం బ్లీ నియోజకవర్గ బాధ్యుడు సుఖదేవో వంజరి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల సుమన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ మహారాష్ట్రలో తొలి కార్యాలయాన్ని గురువారం ప్రారంభించనున్నది. నాగపూర్లో పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించింది. ఏపీలోనూ కార్యాలయం ప్రారంభమైంది. తాజాగా మహరాష్ట్రలోని నాగపూర్లో కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. త్వరలో ముంబై, పూణె, ఔరంగాబాద్, నాందేడ్ పట్టణాల్లోనూ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు.