నాగాలాండ్లో సాధారణ పౌరులపై ఆర్మీ జరిపిన కాల్పుల వ్యవహారం ముదిరి ముదిరి పాకాన పడుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా పార్లమెంట్ వేదికగా చేసిన ప్రకటనను నిరసిస్తూ నాగాలాండ్లోని ప్రజలు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. అమిత్షా వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలని, ఆయన దిష్టి బొమ్మలను కూడా దగ్ధం చేశారు. ఇది మరిచిపోక ముందే అటు కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది. తమ కుటుంబీకులపై కాల్పులు జరిపిన వారికి చట్టం ప్రకారం శిక్షపడే వరకూ, ఎఫ్ఎస్పీఏ చట్టాన్ని రద్దు చేసే వరకూ తాము ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని ముట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
తమకు వెంటనే న్యాయం జరగాలని, అప్పుడే తాము నష్టపరిహారం తీసుకోవడం అన్న అంశంపై ఆలోచిస్తామని ఓటింగ్ గ్రామ కౌన్సిల్ ప్రకటించింది. ఆర్మీ కాల్పుల్లో మరణించిన వారి అంత్యక్రియలు జరిపే కార్యక్రమంలో తాము బిజీ బిజీగా ఉన్నామని, ఆ సమయంలో రాష్ట్ర మంత్రి పివాంగ్ కోన్యాక్, ఇతర అధికారులు వచ్చి, 18 లక్షలిచ్చినట్లు గ్రామ కౌన్సిల్ పేర్కొంది. అయితే తాము వాటిని ఓ బహుమానంగా అనుకున్నామని, అది ఎక్స్గ్రేషియా అని తెలిసొచ్చిందని పేర్కొంది.