Nagaland | వివాదాస్పదమైన ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని వెనక్కి తీసుకునే విషయంపై తాము ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని నాగాలాండ్ ముఖ్యమంత్రి నేఫూరియో సంచలన ప్రకటన చేశారు. ఈ చట్టాన్ని నాగాలాండ్ ప్రజలు ముందు నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారని, ఈ చట్టాన్ని కొనసాగించాలా? వద్దా? అన్న విషయంపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. ఎఫ్ఎస్పీఏ చట్టం రద్దు కావాల్సిందేనని నాగా ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశమైన తర్వాత ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం గమనించాల్సిన అంశం.
సాధారణ పౌరులపై ఆర్మీ అధికారులు కాల్పులు జరిపిన ఘటన అత్యంత వివాదాస్పదమైంది. ఈ ఘటన తర్వాత నాగాలాండ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్షా నాగాలాండ్ ముఖ్యమంత్రితో ఈ నెల 23న భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఈ కీలక సమావేశంలోనే చట్టాన్నివెనక్కి తీసుకునే విషయంపై ఓ కమిటీ వేయాలన్న ప్రతిపాదన వచ్చిందని ముఖ్యమంత్రి నేఫూరియో పేర్కొన్నారు.