కోహిమా: నాగాలాండ్ (Nagaland) అసెంబ్లీ చరిత్ర సృష్టించింది. దేశంలోనే మొదటి పూర్తిస్థాయి కాగిత రహిత అసెంబ్లీగా నిలిచింది. నాగాలాండ్ అసెంబ్లీలో నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ (NeVA) ప్రోగ్రామ్ను అమలు చేస్తున్నారు. దీంతో సభా కార్యకలాపాల్లో పేపర్ను వినియోగించడానికి అవకాశం లేదు. దీనికోసం 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రతి టేబుల్పై ఈ-బుక్ లేదా ట్యాబ్లెట్ను అమర్చారు. దీంతో ఎమ్మెల్యేలు కాగితాలతో పనిలేకుండా తమకు అవసరమైన సమాచారాన్ని పూర్తి ట్యాబ్లెట్లోనే చూసుకునే అవకాశం ఉంటుంది.
నాగాలాండ్.. దేశంలోనే మొదటి పేపర్ లెస్ అసెంబ్లీగా నిలిచిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. నేషనల్ ఈ-విధాన్ ప్రాజెక్టును అమలు చేయడం ద్వారా ఇది సాధ్యమైందన్నారు. దీంతో సభ్యులు అసెంబ్లీ కార్యకలాపాలను పూర్తిగా ఎలక్ట్రానిక్ పరికరాల్లో చూసుకునే వీలుంటుందని తెలిపారు. చట్టసభల్లో కాగిత రహితంగా కార్యకలాపాలు నిర్వహించాలనే లక్ష్యంలో భాగంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.