చెన్నై: స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ (ఎం) నాయకుడు ఎన్ శంకరయ్య (102) ఇకలేరు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవల తీవ్ర జ్వరం రావడంతో శంకరయ్యను ఆయన కుటుంబసభ్యులు తమిళనాడు రాజధాని చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శంకరయ్య జ్వరంతోపాటు జలుబు సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
తమిళనాడుకు చెందిన ఎన్ శంకరయ్య దేశ స్వాతంత్య్రపోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. కమ్యూనిస్టు నాయకుడిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. కాగా, శంకరయ్య భౌతికకాయాన్ని చెన్నైలోని సీపీఐ (ఎం) కార్యాలయానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ కొంతసేపు ఉంచి, అనతరం ఆయన నివాసానికి తరలించనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.