బెంగుళూరు: మైసూరులో జరిగిన గ్యాంగ్ రేప్ ( Mysuru Gangrape ) ఘటన పట్ల ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. సామూహిక హత్యాచారానికి గురైన ఆ యువతిని హాస్పిటల్లో చేర్పించినట్లు చెప్పారు. ఆమె బాయ్ఫ్రెండ్ను దారుణంగా కొట్టారన్నారు. ఇదో దురదృష్టకర సంఘటన అని సీఎం తెలిపారు. గ్యాంగ్ రేప్ ఘటనను సీరియస్గా తీసుకున్నట్లు సీఎం బొమ్మై చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఈ ఘటన పట్ల ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి అరగా జననేంద్ర కూడా స్పందించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్లో ఉన్న రేప్ బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. తాను ఇవాళ మైసూరు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
పరిస్థితి విషమం..
రేప్కు గురైన 23 ఏళ్ల బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకోలేదని పోలీసులు తెలిపారు. అయితే ఆమెతో ఉన్న ఫ్రెండ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతని వద్ద నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారానికి గురైన బాధితురాలిది యూపీ. ఆమె వయసు 23 ఏళ్లు. మైసూరులోని చాముండీ హిల్స్ వద్ద ఆరుగురు యువకులు ఆ యువతిని రేప్ చేశారు. కర్నాటక ఏడీజీపీ ప్రతాప్ రెడ్డి ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నారు. క్రైం జరిగిన ప్రదేశాన్ని కూడా ఆయన విజిట్ చేశారు.
మంగళవారం రాత్రి 7 గంటలకు చాముండి హిల్స్ వద్ద అత్యాచార ఘటన జరిగింది. తాగిన మత్తులో వచ్చిన ఆరుగురు యువకులు ఆమెను రేప్ చేశారు. లలితాద్రిపురలో ఉన్న నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. మొదట ఆ గ్యాంగ్ రేప్ బాధితురాలి నుంచి డబ్బు డిమాండ్ చేశారు. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో.. బాయ్ఫ్రెండ్పై దాడి చేసి.. ఆ యువతిని రేప్ చేశారు. మైసూరు ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ చదువుకునేందుకు ఆమె యూపీ నుంచి వచ్చింది.
మైసూరు రేప్ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. నిందితులను తక్షణమే అరెస్టు చేసి, వారికి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కర్నాటక డీజీపీకి మహిళా కమిషన్ లేఖ రాసింది.