భువనేశ్వర్: ఒక మిస్టరీ లెటర్ ఆధారంగా అదృశ్యమైన యువతి హత్యను పోలీసులు ఛేదించారు. నిందితులైన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఒడిశాలోని నువాపా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న బాలిక ఈ ఏడాది జనవరిలో అదృశ్యమైంది. కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే 11 నెలలుగా ఆ బాలిక గురించి ఏ విషయం కూడా పోలీసులకు తెలియలేదు.
కాగా, ఇటీవల ఆ బాలిక కుటుంబానికి ఒక మిస్టరీ లెటర్ అందింది. ఆ బాలిక, ఒక యువకుడి మధ్య సంబంధం ఉందని అందులో ఉంది. బాలిక తండ్రి ఆ లేఖను పోలీసులకు అందజేశాడు. దీంతో పోలీసులు ఆ లేఖ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బాలికతో సంబంధం ఉన్న పరమానంద సాహును అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు సాహును పోలీసులు ప్రశ్నించగా అసలు విషం చెప్పాడు. నాలుగు నెలల గర్భవతి అని ఆమె చెప్పడంతో తాను భయపడ్డానని, ఆమె అడ్డు తొలగించుకునేందుకు స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు తెలిపాడు. గ్రామం శివారులోని పొలాల్లో బాలిక మృతదేహాన్ని పూడ్చినట్లు వెల్లడించాడు.
దీంతో పోలీసులు బుధవారం ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తవ్వి బాలిక మృతదేహం అవశేషాలను బయటకు తీశారు. నిందితులైన ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరిలో ఇద్దరు యువకులని పోలీసులు వెల్లడించారు.