లక్నో : మా అమ్మ, నేను కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఏనాడూ ఎగబడలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదే ఒక వేళ రాజవంశీకులైతే.. సాధారణ ప్రజల కంటే ముందే వ్యాక్సిన్ కోసం ఎగబడేవారని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబానికి కంచుకోటైనా అమేథిలో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. నేను, మా అమ్మ వ్యాక్సిన్ తీసుకున్నాం. ఆమెకు 100 ఏండ్లు ఉన్నప్పటికీ వ్యాక్సిన్ కోసం ఎగబడలేదు. ఆమె వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నది. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. బూస్టర్ డోసు కూడా తీసుకోలేదు. అదే ఒక వేళ రాజవంశీకులైతే.. నిబంధనలు తుంగలో తొక్కి వ్యాక్సిన్ కోసం ముందు వరుసలో ఉండేవారని మోదీ విమర్శించారు. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీని మోదీ టార్గెట్ చేసి ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ను ఉచితంగా ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే వ్యాక్సిన్ను అమ్ముకునేదని మోదీ పేర్కొన్నారు.