న్యూఢిల్లీ: కేవలం 95 రోజుల్లోనే 13 కోట్ల మంది కోవిడ్ టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. అత్యంత వేగంగా కరోనా టీకాలు ఇచ్చిన దేశం మనదే అని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. 13 కోట్ల కోవిడ్ టీకా డోసులు ఇచ్చేందుకు అమెరికాకు 101 రోజులు పట్టినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. మరో వైపు డ్రాగన్ దేశం చైనా ఆ ఘనతను 109 రోజుల్లో అందుకున్నది. ఇప్పటి వరకు ఇండియాలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 13,01,19,310గా ఉంది. గత 24 గంటల్లోనే 29,90,197 మందికి టీకా ఇచ్చారు.
మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, బెంగాల్, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాలు 59.33 శాతం డోసులను ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. జనవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. తొలుత హెల్త్కేర్ వర్కర్లకు ఇచ్చారు. ఆ తర్వాత ఫ్రంట్లైన్ వర్కర్లకు ఫిబ్రవరి 2 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మార్చి ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు దాటిన వారికి, ఆ తర్వాత ఏప్రిల్ ఒకటి నుంచి 45 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఇవ్వడం మొదలైంది.