మతం పేరుతో కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్న వేళ..తమ స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న సమయాన ఓ ముస్లిం మహిళ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. గణేష్ చతుర్థిని పురస్కరించుకొని, తన ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించింది. నిత్యం పూజలు చేస్తూ పరమత సహనం చాటుతున్నది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ జిల్లా రోరావర్ పోలీస్ సర్కిల్ పరిధి ఏడీఏ కాలనీకి చెందిన రూబీ ఆసిఫ్ ఖాన్ తన ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించుకున్నది. హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తున్నది. స్వామివారికి భక్తిశ్రద్ధలతో మోదకాలు సమర్పిస్తున్నది. వినాయకుడిపై తనకు అపారమైన భక్తి ఉన్నదని, స్వామిని ఇంటికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులెవరూ అభ్యంతరం తెలుపలేదని చెప్పింది. మతాలకతీతంగా తన కుటుంబంతో కలిసి అన్ని పండుగలూ జరుపుకుంటానని తెలిపింది. ఈ నెల 6న ఏడురోజుల్లో వినాయకుడి నిమజ్జనం నిర్వహించనున్నట్టు చెప్పింది. తన భార్య నమ్మకానికి తాను మద్దతిస్తున్నానని, కుటుంబం మొత్తం ఈ వేడుకల్లో పాల్గొంటున్నట్టు ఆమె భర్త ఆసిఫ్ ఖాన్ తెలిపాడు.