పనాజీ, ఆగస్టు 26: హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్టాక్ స్టార్ సొనాలీ ఫోగట్ మృతి కేసులో మరో కొత్త కోణాన్ని గోవా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. హత్యగా భావిస్తున్న ఈ కేసులో నిందితులైన ఫోగట్ సహోద్యోగులు ఇద్దరు ఆమెకు నార్త్ గోవాలోని ఓ రెస్టారెంట్లో జరిగిన పార్టీలో పానీయంలో డ్రగ్స్ కలిపి బలవంతంగా తాగించారని పేర్కొన్నారు.
నిందితులిద్దరూ పానీయంలో ఓ రసాయన పదార్థాన్ని కలిపి బలవంతంగా తాగించడం సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిందని, ఇదే విషయాన్ని నిందితులు సుధిర్ సగ్వాన్, సుఖ్విందర్ సింగ్ విచారణలో ఒప్పకున్నారని కూడా ఐజీపీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు.
ఫోగట్ స్పృహ కోల్పోయిన అనంతరం ఆమెను రెస్టారెంట్లోని ఓ వాష్రూమ్కు తీసుకెళ్లి, అక్కడే రెండు గంటల పాటు ఉన్నారని, అయితే అక్కడ ఏం జరిగిందనే దానిపై నిందితులు నోరు విప్పలేదని చెప్పారు. పానీయంలో కలిపిన రసాయన పదార్థం వలనే ఫోగట్ మరణించినట్టు అనిపిస్తున్నదని, ఆర్థిక పరమైన విషయాలే ఇందుకు కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు.