Mumbai Bridge : ముంబై (Mumbai) మహానగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదాచేసే మరో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) శ్రీకారం చుట్టింది. నగరంలోని వెర్సోవా (Versova), మధ్ ఐలాండ్ (Mudh Island) ప్రాంతాలను కలుపుతూ మలాడ్ క్రీక్ (Malad Kreek) పై రూ.2,395 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక కేబుల్ ఆధారిత వంతెన (కేబుల్-స్టేయ్డ్ బ్రిడ్జ్) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ వంతెన అందుబాటులోకి వస్తే ప్రస్తుతం 60 నుంచి 90 నిమిషాలు పట్టే ప్రయాణానికి ఇక కేవలం 10 నిమిషాలే పడుతుంది. ప్రస్తుతం వెర్సోవా, మధ్ ఐలాండ్ మధ్య ప్రత్యక్ష రోడ్డు కనెక్టివిటీ లేదు. మలాడ్ క్రీక్ ఈ రెండు ప్రాంతాలను వేరు చేస్తోంది. దాంతో రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల దూరం.. చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ట్రాఫిక్ను బట్టి ఈ ప్రయాణానికి గంట నుంచి గంటన్నర సమయం పడుతోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణికుల కోసం జెట్టీ సర్వీసు అందుబాటులో ఉన్నప్పటికీ, అది పూర్తిస్థాయి పరిష్కారం చూపడం లేదు.
ఈ జెట్టీ సర్వీసు ఏడాదిలో కేవలం ఎనిమిది నెలలు మాత్రమే పనిచేస్తుంది. వర్షాకాలంలో భద్రతా కారణాల దృష్ట్యా దీనిని నిలిపివేస్తారు. పరిమిత వేళల్లో మాత్రమే నడిచే ఈ సర్వీసు రోజువారీ ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోతున్నది. ఈ నేపథ్యంలో కొత్త వంతెన నిర్మాణం ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలలను నెరవేర్చనుంది. బీఎంసీ ప్రణాళికల ప్రకారం.. ఈ వంతెనను 2.06 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని దీనిని నాలుగు లేన్లతో విశాలంగా నిర్మిస్తారు.
వాహనాలతోపాటు పాదచారులు, సైక్లిస్టుల కోసం ప్రత్యేక మార్గాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. వంతెనపై ప్రత్యేకమైన లైటింగ్, అత్యవసర సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కేవలం ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా మధ్ ఐలాండ్ వాసులకు విద్య, వైద్యం వంటి అత్యవసర సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బీఎంసీ ఇప్పటికే ప్రాథమిక పనులను ప్రారంభించింది. నేల పరీక్షలు (సాయిల్ టెస్టింగ్), స్టేషన్ సర్వేలు వంటివి పూర్తిచేసింది. అయితే, ప్రధాన సివిల్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి బాంబే హైకోర్టు నుంచి తుది అనుమతులు రావాల్సి ఉంది.
పర్యావరణ అనుమతులకు సంబంధించిన ఈ కేసుపై సెప్టెంబర్ నాటికి తుది విచారణ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోర్టు అనుమతులు లభించగానే.. ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించాలని బీఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే 2029 నాటికి ఈ వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.