ముంబై: రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లోని పట్టాలపై ఒక కుక్క ఉన్నది. గమనించిన ఒక వ్యక్తి పట్టాల మధ్యకు వెళ్లి దానిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఒక రైలు ఆ పట్టాలపై వస్తున్నది. దీంతో రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఆ రైలును ఆపేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఒక రైల్వే స్టేషన్లో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఆ స్టేషన్లోని రైలు పట్టాలపై ఒక కుక్క ఉన్నది. గమనించిన ఒక వ్యక్తి ఆ పట్టాల వద్దకు వెళ్లాడు. ఆ కుక్కను రక్షించేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు ఆ పట్టాలపై ఒక రైలు వస్తున్నది. అయినప్పటికీ ఆ వ్యక్తి రైలు రాకను పెద్దగా పట్టించుకోలేదు. కుక్కను కాపాడటంపైనే అతడి దృష్టంతా ఉంది. అయితే స్టేషన్లోని ఫ్లాట్ఫారంపై ఉన్న జనం ఉత్కంఠతో రైలు రాకను గమనించారు. రైలును ఆపాలంటూ కేకలు వేయడంతోపాటు సైగలు చేశారు. గమనించిన డ్రైవర్ ఆ ట్రైన్ను స్లో చేశాడు. ఇంతలో ఆ వ్యక్తి కుక్కను పట్టుకుని ఫ్లాట్ఫామ్పైకి చేర్చాడు. మరో వ్యక్తి చేయి అందించగా అతడు కూడా ఫ్లాట్ఫామ్పైకి చేరుకున్నాడు. దీంతో మెల్లగా వస్తున్న ఆ రైలు అనంతరం ఆ పట్టాల మీదుగా వెళ్లిపోయింది.
కాగా, ఆ రైల్వే స్టేషన్లోని కొందరు వ్యక్తులు ఈ సంఘటనను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఒక వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ముంబై చాలా బిజీ సిటీ. ఎవరూ ఖాళీగా ఉండరు. ఎవరూ ఒకరినొకరు పట్టించుకోరు. అదే సమయంలో ముంబైకర్లు..’ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘రైలు పట్టాలపై ఉన్న మనిషిని, కుక్కను రక్షించడంలో ముంబైవాసులు చాలా బిజీగా ఉన్నారు’ అంటూ ఒకరు వ్యాఖ్యానించారు. ముంబై నగర వాసులపై ఉన్న పలు విమర్శలను కొందరు ప్రస్తావించగా మరికొందరు వాటిని ఖండించారు.
Mumbai is a very busy city, no one is free, no one cares for each other.
Meanwhile Mumbaikars: pic.twitter.com/IgASgWdNwV
— Godman Chikna (@Madan_Chikna) February 22, 2023