Manda Krishna | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలను మోసం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. రేవంత్ మాదిగలకు చేసిన ద్రోహంపై మే 4న దీక్ష చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇవాళ మంద కృష్ణ మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి రాజకీయ ఎదుగుదలకు మాదిగలు ప్రధాన పాత్ర పోషించారు అని మంద కృష్ణ తెలిపారు. తన గెలుపునకు మాదిగలు సహకారం అందించారని స్వయంగా రేవంత్ చెప్పారు. రేవంత్ రెడ్డి వల్ల మోత్కుపల్లి నర్సింహులకు తీవ్ర అవమానం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి మాదిగలకు ప్రాధాన్యం లేకుండా పోతుంది. మాలలతో కుమ్మక్కై మాదిగలకు రేవంత్ అన్యాయం చేస్తుండు. కడియం కులం గురించి విచారణ జరపాలని గతంలో రేవంత్ అన్నాడు. వరంగల్లో ఎంతో మంది మాదిగ జాతి నాయకులు ఉండగా, కడియం కావ్యకు టికెట్ ఎందుకు ఇచ్చారు..? తెలంగాణలో ఉండే మాదిగలు పార్టీలకతీతంగా కాంగ్రెస్ పార్టీపై నిరసన తెలపాలి. రేవంత్ మాదిగలకు చేసిన ద్రోహంపై మే 4న దీక్షకు పిలుపునిస్తున్నాం. రేవంత్ రెడ్డి రాజకీయ మూల్యం చెల్లించుకొక తప్పదు అని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.