ముంబై: ముంబైలో మీజిల్స్ (తట్టు) కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. మంగళవారం 20 మంది తట్టు (Measles) బారినపడగా, బుధవారం మరో 13 కేసులు కొత్తగా నమోదయ్యాయి. వైరల్ డిసీజ్ వల్ల మరో చిన్నారి మరణించాడని బృహిన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. నగరవ్యాప్తంగా బుధవారం 30 మంది మీజిల్స్ లక్షణాలతో దవాఖానల్లో అడ్మిట్ అయ్యారని చెప్పారు. అయితే 22 మంది రోగులు కోలుకున్నారని తెలిపారు. మరో 156 మందిలో జ్వరం, దద్దుర్ల వంటి లక్షణాలు గుర్తించామని వెల్లడించారు. గత 24 గంటల్లో నగర వ్యాప్తంగా 3.04 లక్షల గృహాల్లో సర్వే నిర్వహించామని పేర్కొన్నారు.
దీంతో ముంబై మహానగరంలో ఈ ఏడాది 3534 మీజిల్స్ కేసులను గుర్తించామని అధికారులు వెల్లడించారు. కాగా, బీఎంసీలోని 22 ప్రాంతాల్లో ఈ తరహా కేసులను గుర్తించామని చెప్పారు. మీజిల్స్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, వారి చికిత్స కోసం 370 బెడ్లు కేటాయించామని అధికారులు తెలిపారు.
అయితే ముంబైలో భారీసంఖ్యలో మీజిల్స్ కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ముగ్గురు సభ్యులతో కూడిన హై లెవల్ కమిటీని ముంబైకి పంపించింది. వ్యాధి వ్యాప్తిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులకు సూచనలు ఇస్తారని వెల్లడించింది.
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల వల్ల ఒకరి నుంచి మరొకరికి మీజిల్స్ సోకుతుంది. ఒళ్లంత దద్దుర్లు, తీవ్రమైన జ్వరం దీని లక్షణాలు. విరేచనాలు, న్యుమోనియా కూడా కొందరిలో ఉంటుంది.. ఇవన్నీ కలిసి మరణానికి కారణమవుతాయి. రోగ నిరోధకత స్థాయి 95 శాతం కంటే తక్కువగా ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఇది వ్యాపించే అవకాశం ఉంది. 1963లోనే తట్టుకు వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షా 40 వేల మంది ప్రాణాలను హరిస్తుండటం గమనార్హం.