ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జోరుగా వానలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోకి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో ముంబైలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతున్నదని తెలిపింది. ఈ నెల 9 నుంచి 13 వరకు ముంబైతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 10న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, అయితే అవి ఈసారి కాస్త ముందుగా వచ్చేశాయని ఐఎండీ ముంబై డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. జయంత సర్కార్ వెల్లడించారు.
కాగా, ముంబైలోని కొలాబా, శాంతాక్రజ్లో నిన్న ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 5.30 గంటల వరకు 65.4 మిల్లీమీటర్లు, 50.4 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. అదేవిధంగా చించౌలీ, బొరివాలి, దహిసార్లో 60 మి.మీ. వర్షపాతం నమోదయ్యిందని వెల్లడించింది. ముంబైతోపాటు రాయ్గఢ్, థానే, పాల్ఘర్, పుణె, నాషిక్లలో వర్షం కురిసింది.