ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో గురువారం పోలీస్ బృందం భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అధికారుల బృందం 16.100 కిలోల డ్రగ్స్ను సీజ్ చేయగా.. వాటి విలువ రూ.16కోట్లు ఉంటుందని తెలిపారు. అన్టాప్ హిల్ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ విక్రయిస్తున్నాని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి, డ్రగ్స్ వ్యాపారులను పట్టుకున్నారు.
ముగ్గురు నిందితులపై పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. డ్రగ్ రాకెట్ వెనుక పెద్ద ముఠా హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ముంబైలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాదక ద్రవ్యాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇటీవల, క్రైమ్ బ్రాంచ్తో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముంబై, పరిసర ప్రాంతాల్లో అనేక మందిని అరెస్ట్ చేసింది.