ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు నమోదు చేశారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్పై షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్కు ఆయన చేసిన ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు అడిగారు. మంత్రి నవాబ్పై సమీర్ వాంఖడే చేసిన ఆరోపణలను రికార్డు చేశారు. దీనిపై ఏసీపీ స్థాయి అధికారి విచారణ జరుపుతున్నారు.
మరోవైపు, సమీర్ వాంఖడే బంధువులు తనను కలిసినట్లు షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్ విజయ్ సంప్లా గురువారం మీడియాకు తెలిపారు. మంత్రి నవాబ్ మాలిక్ మీడియా ద్వారా చేస్తున్న విమర్శల తీరుపై వారు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కులంపై అసభ్య పదజాలం, తమ సంఘాన్ని బాధించడంతోపాటు అవమానించారని మంత్రిపై ఆరోపణలు చేశారన్నారు.
మంత్రి నవాబ్ మాలిక్కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని సమీర్ వాంఖడే బంధువులు తెలిపారని విజయ్ సంప్లా అన్నారు. వాటన్నింటిని పరిశీలించి డీజీపీ, చీఫ్ సెక్రటరీకి నోటీసులు పంపాలని తన అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. వాస్తవాలు నిజమని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.