బెంగళూరు: ఇప్పటికే హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం పేరును కళ్యాణ కర్ణాటకగా మార్చి కర్ణాటక ప్రభుత్వం.. ఇప్పుడు ముంబై-కర్ణాటక ప్రాంతం పేరును కూడా మార్చింది. తాజాగా ఆ ప్రాంతానికి కిట్టూర్ కర్ణాటకగా నామకరణం చేసింది. ఈ విషయాన్ని కర్ణాటక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధుస్వామి వెల్లడించారు. రాష్ట్రాల పునర్నిర్మాణం అనంతరం కూడా మహారాష్ట్ర నుంచి కర్ణాటకలో కలిసిన ప్రాంతాన్ని ముంబై-కర్ణాటక రీజియన్గా పిలువడంలో అర్థం లేదని వారం రోజుల క్రితం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు.
త్వరలోనే ముంబై-కర్ణాటక రీజియన్ పేరును కిట్టూర్ కర్ణాటకగా మారుస్తామని అప్పుడే ప్రకటించారు. ఆ మేరకు ఇవాళ రీజియన్ పేరును మార్చినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్-కర్ణాటక రీజియన్ పేరును కళ్యాణ కర్ణాటకగా మార్చారు. కాగా, 1956లో రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగింది. అప్పట్లో ఒక రాష్ట్రంలోని ప్రాంతాలను మరో రాష్ట్రంలోకి సర్దుబాటు చేశారు. అయితే, మహారాష్ట్ర నుంచి కర్ణాటకలో కలిసిన ప్రాంతం ముంబై-కర్ణాటక రీజియన్గా, ఉమ్మడి ఏపీ నుంచి కర్ణాటకలో కలిసిన ప్రాంతం హైదరాబాద్-కర్ణాటకగా పేరుపడ్డాయి. ఆ పేర్లకు అర్థం లేదని భావించిన కర్ణాటక సర్కారు తాజాగా కొత్త పేర్లు పెట్టింది.