ముంబై: భార్యను అతి దారుణంగా హత్యచేసిన ఓ భర్తకు మహారాష్ట్రలోని ముంబై (Mumbai) సెషన్స్ కోర్టు జీవితఖైదు (life sentence) విధించింది. తన తల్లిని తండ్రి హత్య చేయడం కళ్లారా చూసిన ఓ నాలుగేళ్ల బాలుడు చెప్పిన సాక్ష్యం ఆధారంగా కోర్టు దోషికి శిక్ష వేసింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని దాదర్ ప్రాంతానికి చెందిన ఉమేశ్ బొబలే ఓ దంత వైద్యుడు. 2009లో అతనికి తనూజ అనే మహిళతో వివాహం జరిగింది.
వారికి ఒక కుమారుడు జన్మించిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తనూజ తన భర్తపై గృహహింస కేసు పెట్టింది. తర్వాత భర్తకు దూరంగా తన పుట్టింటి వారితో కలిసి ఉండేది. ఈ క్రమంలో భార్యపై కోపం పెంచుకున్న ఉమేశ్.. 2016 డిసెంబర్ 11న ఆమె ఉంటున్న ఇంటికి వచ్చి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 34 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు.
తల్లిని తన తండ్రి అత్యంత కిరాతకంగా హత్య చేయడం అప్పటికి నాలుగేళ్ల వయస్సున్న వారి కొడుకు కళ్లారా చూశాడు. హత్య అనంతరం హంతకుడు ఉమేశ్ పోలీసులకు జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. తన మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆ క్షణంలో ఏం చేస్తున్నానో తనకు తెలియలేదని ఉమేశ్ న్యాయస్థానానికి తెలిపాడు.
ఆ తర్వా ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిపిన సెషన్స్ కోర్టు మొత్తం 10 మంది సాక్ష్యుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకుంది. వారిలో మృతురాలి కుమారుడు, ఆమె సోదరుడు, నిందితుడి బంధువు తదితరులు ఉన్నారు. 2020లో మృతురాలి కుమారుడు కోర్టులో సాక్ష్యం చెప్పాడు. ‘ఆ రోజు రాత్రి నాన్న మా ఇంటికి వచ్చి అమ్మను కొట్టాడు. కత్తితో పొడిచి చంపాడు. నేను అరవలేదు. కానీ, నా గుండెల్లో ఏదో దడగా అనిపించింది’ అని కోర్టుకు తెలిపాడు. ఆ చిన్నారి చెప్పిన సాక్ష్యం ఆధారంగా కోర్టు ఉమేశ్కు బొబలేకు జీవిత ఖైదు విధించింది.