Mumbai Court | ముంబై: ప్రియునికి ప్రియురాలు బ్రేకప్ చెప్పిన తర్వాత, మానసిక ఆవేదనతో ఆ ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడితే, ఆ ప్రియురాలు అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ముంబై కోర్టు చెప్పింది. అయితే ఇష్టానుసారం ప్రేమికులను మార్చడం నైతికంగా సరికాదని తెలిపింది. ఆమె తిరస్కరణను ఎదుర్కొన్న బాధితునికి చట్టపరమైన ఉపశమనం ఏదీ లేదని వివరించింది. కేసు వివరాలు ఏమిటంటే, నితిన్ కేనీ, మనీషా చుడసమ ప్రేమించుకున్నారు.
కొన్నాళ్ల తర్వాత నితిన్కు మనీషా బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత ఆమెకు రాజేశ్ పన్వర్తో నిశ్చితార్థం జరిగింది. దీంతో 2016 జనవరి 15న నితిన్ తన ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. మనీషా బ్రేకప్ చెప్పడంతో నితిన్ మానసికంగా కుంగిపోయినట్టు కనిపిస్తున్నదని అదనపు సెషన్స్ జడ్జి ఎన్పీ మెహతా వ్యాఖ్యానించారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు వెల్లడి కావాలంటే, బాధితుడిని అందుకు పురిగొలిపినట్లు లేదా సలహా ఇచ్చినట్లు స్పష్టమవ్వాలని తెలిపారు.