ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులకు ముంబై సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ నెల 18న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని చేసిన వ్యాఖ్యలపై నవనీత్ రాణా దంపతులు అరెస్టవగా.. ప్రత్యేక కోర్టు ఈ నెల 4న షరతులతో బెయిల్ను మంజూరు చేయగా.. ఈ నెల 5న జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, బెయిల్ షరతులను ఉల్లంఘించారని పోలీసులు కోర్టులో దరఖాస్తు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా నవనీత్ దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు జారీ చేయకూడదో తెలియజేయాలి’ అంటూ కోర్టు నోటీసులు జారీ చేసింది.
నవనీత్ రాణా దంపతులు బెయిల్ షరతులను ఉల్లంఘించినందున బెయిల్ను రద్దు చేసి.. నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేయాలని కోర్టును కోరారు. జైలుపై, అధికారులపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే వారు మీడియాతో మాట్లాడటానికి బదులుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉండాల్సిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరత్ వాదించారు. అంతే కాకుండా నవనీత్ బయటకు వచ్చిన తర్వాత ఓపెన్ చాలెంజ్ చేసిందని, ఇది కోర్టు ఆదేశాలకు సవాల్ అంటూ ఘరత్ వాదించారు. ఈ క్రమంలో పోలీసులు చేసిన ఆరోపణలపై నవనీత్ రాణా దంపతులు ఏం చెబుతారో వినేందుకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.