ముంబై: విద్యార్థినులు బురఖా (Burqa) ధరించి కాలేజీకి రావడాన్ని ముంబైలోని (Mumbai) ఓ కళాశాల నిషేధం విధించింది. యునిఫాం పాలసీలో (Uniform policy) భాగంగా బురఖా ధరించినవారికి కాలేజీలోకి అనుమతిలేదని తెలిపింది. దీంతో పలువురు విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కాలేజీ గేట్ముందు నిరసనకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఎన్జీ ఆచార్య అండ్ డీకే మరాఠే కాలేజీ (NG Acharya & DK Marathe College) కొత్తగా యూనిఫాం పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా బుర్ఖాలు ధరించిన విద్యార్థినులను క్యాంపస్లోకి రాకుండా ఆంక్షలు విధించింది. దీంతో కాలేజీ గేటు బయట బాలికల తల్లిదండ్రులు, విద్యార్థులు నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు, కళాశాల అధికారులతో చర్చించడంతో పరిస్థితి సద్దుమణిగింది.ఈ క్రమంలో కాలేజీలో విద్యార్థినులు దుస్తులు ధరించేటప్పుడు పాటించాల్సిన నియమాలను పేర్కొంటూ కళాశాల యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా, ఈ ఏడాది నుంచి కాలేజీలో కొత్తగా డ్రెస్ కోడ్ను (Dress code) అమలు చేస్తున్నామని, ఈ విషయాన్ని ముందుగానే విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపామని కళాశాల ప్రిన్సిపల్ విద్యాగౌరీ లేలే ( Vidya Gauri Lele) అన్నారు. కొత్త డ్రెస్ విధానంపై చర్చించడానికి తల్లిదండ్రులతో మే 1న సమావేశం నిర్వహించామని చెప్పారు. ఈ సందర్భంగా బురఖా, హిజాబ్(Hijab), స్కార్ఫ్లు (Scarf), స్టిక్కర్లపై నిషేధంతో సహా ప్రతి విషయాన్ని తెలిపామని వెల్లడించారు. డ్రెస్ కోడ్కు అప్పుడు అందరూ అంగీకరించారని, కానీ కొందరు ఇప్పుడు నిరసన వ్యక్తంచేస్తున్నారని తెలిపారు. డ్రెస్ కోడ్ను వ్యతిరేకించేవారు కాలేజీ నుంచి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు.
బాలికల భద్రత, గౌరవాన్ని పరిగణనలోకి తీసుకుని బురఖా, హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించి కళాశాలకు రావడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. అయితే బాలికలు తరగతి గదిలోకి ప్రవేశించే ముందు వారు దానిని తీసివేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం వెళ్లేటప్పుడు మళ్లీ బురఖా, హిజాబ్ ధరించవచ్చని చెప్పారు.