Mumbai | ముంబయిలోని గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో అరేబియా సముద్రంలో అనుమానాస్పద బోటు కలకలం సృష్టించింది. ముంబయి సముద్ర గస్తీ పోలీసులు వేగంగా స్పందించి బోటును స్వాధీనం చేసుకున్నారు. ఆ బోటులో ముగ్గురు తమిళనాడుకు చెందిన మత్స్యకారులున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ముగ్గురి నుంచి ఎలాంటి ఆయుధాలు లభ్యం కాకపోవడంతో తీవ్రవాద ఘటనకు అవకాశం లేదని పోలీసులు పేర్కొన్నారు.
సముద్ర గస్తీని తప్పించుకొని కువైట్ బోట్ గేట్వే ఆఫ్ ఇండియాకు ఎలా చేరిందనే చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీచ్కు కొద్దిదూరంలో అరేబియా సముద్రంలో కదలికలు కనిపించడంతో భారత జలాల్లోకి అనుమానాస్పద బోట్ ప్రవేశించినట్లుగా వాచ్ టవర్ పేర్కొంది. దీంతో ముంబయి పోలీసుల పెట్రోలింగ్ బృందం పడవను అడ్డగించి.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని కొలాబా పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి.. విచారణ ప్రారంభించారు. గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పద పడక కనిపించడం 26/11 ఉగ్రదాడిని గుర్తుకు తెచ్చింది.
ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, కోస్టల్ పోలీసుల సంయుక్త బృందం విచారణ చేపట్టింది. అయితే, ఈ ఘటనపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిందితులు కువైట్ సరిహద్దును ఎలా దాటారు ? ముంబయి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటైన సాసూన్ డాక్ కాంప్లెక్స్కు చేరుకునేందుకు పడవలో ఎలా వెళ్లారు ? దక్షిణ భారత సముద్ర తీరానికి వెళ్లకుండా గేట్ వే ఆఫ్ ఇండియాకు ఎందుకు వచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమిళనాడు పోలీసుల ద్వారా ముగ్గురి కుటుంబీకులను పోలీసులు సమాచారం అందించినట్లు తెలుస్తున్నది.