ముంబై : మహారాష్ట్రలోని ముంబై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు 24 గంటల్లో వేర్వేరు కేసుల్లో రూ.7.87కోట్ల విలువైన 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.22లక్షల విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. ఈ నెల 11-12 మధ్య ఆయా కేసుల్లో ప్రమేయం ఉన్న ఏడుగురు ప్రయాణికులను అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు.. దుబాయి నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి 9.895 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి ఛాతిభాగంలో ప్రత్యేకంగా బెల్టులా ధరించినట్లు పేర్కొన్నారు. దుబాయిలో ఇద్దరు సూడాన్ ట్రావెలర్లు తనకు తనకు ఈ బంగారాన్ని ఇచ్చారని సదరు వ్యక్తి అధికారుల విచారణలో తెలిపాడు.
సూడాన్ ట్రావెర్లతో పాటు సదరు వ్యక్తిని 14 రోజు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. మరో కేసులో రూ.99.75లక్షల విలువైన 1.875 కిలోల బంగారం పొడిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోదుస్తుల్లో దాచి అక్రమంగా తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన మరో సూడాన్ జాతీయుడి నుంచి రూ.51.17లక్షల విలువైన 973 బంగారం పొడిని స్వాధీనం చేసుకున్నారు. పురీషనాళంలో దాచి తరలించేందుకు యత్నించగా పట్టుకొని, అరెస్టు చేశారు. మరో వైపు దుబాయి వెళ్లే విమానంలో భారతీయ ప్రయాణికుడి నుంచి 50వేల దిర్హామ్లను (రూ.11.20లక్షలు) తరలిస్తుండగా పట్టుకున్నారు. మరో వ్యక్తి నుంచి 45వేల దిర్హామ్స్ (రూ.10.08లక్షలు)ను స్వాధీనం చేసుకున్నారు.