పట్నా: బీహార్లోని దర్భంగా, పట్నా ఎయిర్పోర్టులను బాంబులు పెట్టి పేల్చేయబోతున్నాననంటూ తప్పుడు కాల్ చేసి పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన ఓ తాగుబోతు అరెస్టయ్యాడు. నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పంజాబీ కాలనీ నుంచి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఫేక్ కాల్స్ చేసేందుకు నిందితుడు వినియోగించిన మొబైల్ ఫోన్ను సీజ్ చేశారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని తేలింది. పైగా ఫూటుగా మద్యం సేవించి బెదిరింపు కాల్స్ చేసినట్లు వెల్లడైంది. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లిన సమయంలో కూడా అతడు మద్యం సేవిస్తూ ఉన్నాడని సమస్తిపూర్ జిల్లా ఎస్పీ వినయ్ తివారీ చెప్పారు. ఫేక్ కాల్ చేసింది సుధాన్షు శేఖర్ అలియాస్ ముకుంద్గా గుర్తించి, అతని లొకేషన్ ట్రేజ్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కాగా దర్భంగా, పట్నా ఎయిర్పోర్టులను పేల్చివేయబోతున్నానంటూ ఇవాళ ఉదయం ముకుంద్ పోలీసులకు ఫోన్ చేశాడు. దాంతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. బాంబ్ స్క్వాడ్ రంగంలోకి రెండు ఎయిర్పోర్టుల్లో అణువణువు క్షుణ్ణంగా గాలించారు. మూడు రౌండ్ల తనిఖీ అనంతరం ఎయిర్పోర్టుల్లో ఎలాంటి బాంబులు లేవని తేల్చారు.