Shatrughan prediction | హిమాచల్ ప్రదేశ్ , గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీఎంసీ ఎంపీ, నటుడు శతృఘ్న సిన్హా భిన్నమైన జోస్యం చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కింగ్ కాకపోయినా.. ఆయన మాత్రం కింగ్ మేకర్గా మారుతారని చెప్పారు. త్వరలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు నరేంద్ర మోదీని మరింత బలహీనంగా మార్చుతాయన్నారు. 27 ఏండ్లుగా బీజేపీలో ఉన్న శతృఘ్న సిన్హా.. ఇప్పటివరకు ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. రెండుసార్లు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన సిన్హా.. ఆదివారం తనను కలిసిన మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
హిమాచల్ప్రదేశ్లో ఇప్పటివరకు పెండ్యులమ్ విధానం నడిచిందని, ఇకపై అది ఉండదని శతృఘ్న సిన్హా అన్నారు. 1985 నుంచి వరుసగా రెండోసారి ఏ ప్రభుత్వం రాలేదని.. అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చిందన్నారు. హిమాచల్లో కాంగ్రెస్పై ప్రజలకు సానుభూతి ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర బ్రహ్మాండంగా సాగుతున్నదని రాహుల్కు కితాబునిచ్చారు. ఈ యాత్ర ప్రభావం దేశమంతటా పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.