న్యూఢిల్లీ : అభివృద్ది, ప్రజలకు చేసిన మేళ్లు ఆధారంగా తమ పార్టీ ఓట్లను అభ్యర్ధిస్తుందని, రామ మందిరం, కులాలు వంటి అంశాలతో తాము రాజకీయం చేయబోమని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం స్పష్టం చేశారు. అభివృద్ధి రాజకీయాలు ఢిల్లీలో ఎలాంటి ఫలితాలు అందించాయో తాము ప్రపంచానికి చాటిచెప్పామని ఆయన పేర్కొన్నారు. దేశ రాజధానిలో ఈ తరహా విధానం ఫలించిన క్రమంలో ఇదే మోడల్ను యూపీలోనూ అనుసరిస్తామని ఓ జాతీయ వార్తా చానెల్ కార్యక్రమంలో మాట్లాడుతూ సింగ్ వెల్లడించారు.
వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మొత్తం 403 స్ధానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. తాము కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలకు తోక పార్టీగా పనిచేయబోమని వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా తమది బీ టీం కాదని, ఏ టీం అని సింగ్ పేర్కొన్నారు. తాము పోటీచేసిన ప్రతిచోటా పంజాబ్, రాజస్ధాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో బీజేపీకి ఓటమి ఎదురైందని చెప్పారు. గోవాలోనూ ఆప్నకు ఆరు శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.