మహారాష్ట్రలో 12 చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ముంబై, పూణెతో సహా మరో 12 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బాంద్రా అనే ప్రాంతంలోని రాహుల్ కనాల్, కండివాలిలోని శివసేన ఎమ్మెల్యే సదానంద కదమ్తో పాటు పూణెలోని బజరంగ్ కర్మాటే ఇళ్లల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అయితే రాహుల్ కనాల్ మంత్రి ఆదిత్య థాకరేకు అత్యంత సన్నిహితుడిగా పేర్కొంటారు. ఇక.. మిగతా ఇద్దరు కూడా మరో మంత్రి అనిల్ పరబ్కు సన్నిహితులుగా పేర్కొంటున్నారు. మరోవైపు… శివసేన నేత, బీఎంసీ ఉప నేత యశ్వంత్ జాదవ్, ఆయన సన్నిహితుడు బిమల్ అగ్రవాల్, బిపిన్ జైన్తో సహా పలువురు ప్రముఖులపై ఈడీ దాడులు నిర్వహించింది.
దాడులపై తీవ్రంగా స్పందించిందిన శివసేన
12 చోట్ల జరిగిన ఐటీ రైడ్స్పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాలే టార్గెట్గా, శివసేన, తృణమూల్ కాంగ్రెస్సే టార్గెట్గా ఈడీ ఎందుకు దాడులు చేస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సూటిగా ప్రశ్నించారు. కేంద్రం ఓ రకంగా ఒత్తిడి పెడుతోందని మండిపడ్డారు. ఐటీ దాడుల్లో అధిక శాతం మహారాష్ట్రలోనే జరిగిందని, 14 మంది ప్రముఖులపై ఐటీ రైడ్స్ జరిగాయని ఆయన గుర్తు చేశారు. ఇక.. 7 సార్లు బెంగాల్పై జరిగాయన్నారు. బీజేపీ నేతల ఇళ్లపై మాత్రం ఐటీ దాడులు జరగడం లేదని, వారేమైనా రోడ్లపై అడుక్కుంటున్నారా? అంటూ రౌత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.