MP quota : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి పార్లమెంటు సభ్యులకు గతంలో ఇచ్చిన ఎంపీ కోటాను (MP Quota) పునరుద్ధరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం (Union Govt) క్లారిటీ ఇచ్చింది. కేవీల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంపీ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన ఏదీ లేదని తేల్చి చెప్పింది. లోక్సభ (Lok Sabha) లో జేడీయూ ఎంపీ (JDU MP) రాంప్రీత్ మండల్ (Ram Preeth Mandal) అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తూ బదిలీ అయ్యే ఉద్యోగుల పిల్లల విద్యావసరాలను తీర్చేందుకు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటయ్యాయని తన సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. కేవీల ద్వారా దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్య అందుతుందని వెల్లడించారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రవేశాల్లో ఉండే ఎంపీ కోటా సహా పలు ప్రత్యేక ప్రావిజన్లను గతంలో ఉపసంహరించుకుందని తెలిపారు. ఈ ప్రత్యేక కోటాలు తరగతి గది సంఖ్యకు మించి ఉండటంతో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి అధికంగా ఉండేదని వెల్లడించారు.
అందుకే తరగతి గదిలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ఆరోగ్యకరంగా ఉండేలా చూడటం, వ్యవస్థలో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న జాతీయ విద్యా విధానం లక్ష్యానికి అనుగుణంగా ఉత్తమ అభ్యాసన ఫలితాలు సాధించేందుకు ఈ ప్రత్యేక కోటాలను తొలగించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. కాగా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులను సిఫార్సు చేసే పలు ప్రత్యేక కోటాలను కేంద్రం 2022 ఏప్రిల్లో రద్దు చేసింది.