ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం వెలుపల హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని బెదిరించినందుకు ఎంపీ నవ్నీత్ రాణా, ఆమె భర్త రవి రాణాలపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ రాణా దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ జస్టిస్ వరాలే బెంచ్ ఎదుట సోమవారం మద్యాహ్నం విచారణకు రానుంది. ఇరు వర్గాల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారని శనివారం నవనీత్ రాణా, రవి రాణాలను ముంబై పోలీసులు అరెస్ట్ చేయగా ముంబై కోర్టు 14 రోజుల కస్టడీకి తరలించింది.
మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ రాణాను ఆదివారం రాత్రి బైకుల్లా మహిళా జైలుకు తరలించగా ఆమె భర్త బద్నేరా ఎమ్మెల్యే రవి రాణాను నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. ఎంపీ, ఎమ్మెల్యే జంటపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వారు ప్రభుత్వ యంత్రాంగాన్ని సవాల్ చేయడంతో పాటు సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపించారు.
ఏప్రిల్ 29న రాణా దంపతుల బెయిల్ పిటిషన్ను కోర్టు విచారించనుంది. ఇక అంతకుముందు శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే తన నివాసంలో హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని లేనిపక్షంలో తాను మాతోశ్రీకి వెళ్లి హనుమాన్ చాలీసా చదువుతానని ఎమ్మెల్యే రవి రాణా హెచ్చరించారు. ఆపై రాణా దంపతులను శివసేన శ్రేణుల నిరసనల మధ్య శనివారం రాత్రి ముంబై పోలీసులు నిలువరించారు.