హోషంగాబాద్: రన్నింగ్ ట్రెయిన్ పక్కన నిలబడి వీడియో తీసుకోవాలన్న ఒక యువకుడి మోజు అతని నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫ్రెండ్ వీడియో తీస్తుండగా ట్రాక్ పక్కన నిలబడి ఫోజు ఇస్తున్న యువకుడిని వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం హోషంగాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హోషంగాబాద్ జిల్లాలో ఇటార్సీ-నాగ్పూర్ రైల్వే లైన్ పక్కనగల శ్రద్ధదేవ్ ఏరియాకు చెందిన సంజు చౌరే (22) సోషల్ మీడియాలో పోస్టు చేయడం కోసం రన్నింగ్ ట్రెయిన్ పక్కన నిలబడి వీడియో తీసుకోవాలని భావించాడు. ఆ మేరకు సంజు చౌరే రైల్వే ట్రాక్ పక్కన నిలబడగా అతని స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. ఇది గమనించిన లోకోపైలెట్ గట్టిగా హారన్ మోగిస్తూ వచ్చినా సంజు చౌరే పక్కకు జరుగలేదు. దాంతో రైలు వేగంగా ఢీకొని ఎగిరిపడ్డాడు.
ఒళ్లంతా గాయాలతో స్పృహ లేకుండా పడి ఉన్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, సంజు చౌరేను రైలు ఢీకొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కింది వీడియోలో మీరు కూడా ఆ దృశ్యాలను వీక్షించవచ్చు.