న్యూఢిల్లీ, మార్చి 30: రూపాయి పాతాళంలోకి పడిపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు మొదలైనప్పటి నుంచి వేగంగా క్షీణిస్తున్న రూపాయి మారకం విలువ సోమవారం భారీగా పతనం చెందింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 95 మార్క్ను అధిగమించింది. ఇంట్రాడేలో 95.22 కనిష్ఠాన్ని తాకిన రూపాయి విలువ ఈ పతనాన్ని అడ్డుకట్ట వేయడానికి రిజర్వుబ్యాంక్రంగంలోకి దిగడంతో చివర్లో 15 పైసలు ఎగబాకి 94.70 వద్ద ముగిసింది. 165 పైసల శ్రేణిలో కదలాడిన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు వరుసగా 31 రోజులుగా పతనం చెందుతూనే ఉన్నది.
రిజర్వుబ్యాంక్ ప్రతీరోజూ ట్రేడింగ్ ముగింపు నాటికి ఆన్షోర్ మార్కెట్లో బ్యాంకులు 100 మిలియన్ డాలర్ల వరకే ఓపెన్ పొజిషన్లు ఉంచుకునేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఫారెక్స్ మార్కెట్ ప్రారంభంలో 128 పైసలు లాభపడి 93.57కి చేరుకున్నది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి విలువ 4 శాతానికి పైగా పతనం చెందింది. మార్చి 27న 94.82 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల అంశాలు రూపాయి పతనాన్ని ఎగదోశాయి. గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 115 డాలర్ల వద్దకు చేరుకోవడం రూపాయి పతనానికి ఆజ్యంపోశాయని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. ముడి చమురు పెరగడంతో దిగుమతుల భారం మరింత పెరుగుతున్నదన్న అంచనాతో మదుపరులు ఆందోళనకు గురయ్యారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూపాయికి అచ్చిరాలేదు. ఈ ఏడాది ఏకంగా రూపాయి విలువ 10 శాతం వరకు నష్టపోయింది. గడిచిన 14 ఏండ్లలో ఇదే అతిపెద్ద పతనం కావడం విశేషం. 2011-12లో అత్యధికంగా 12.4 శాతం పడిపోయిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురికావడం, ద్రవ్య లభ్యత పరిస్థితులు మరింత కఠినతరం కావడం రూపాయి పతనానికి ఆజ్యంపోసింది. కరెన్సీ పతనానికి అడ్డుకట్ట వేయడానికి రిజర్వుబ్యాంక్ గత మూడు నెలల్లో 55.073 బిలియన్ డాలర్లను విక్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.