భోపాల్ : పెండ్లి నాటి ప్రమాణాలకు జీవిత భాగస్వామి మరణంలోనూ ఆయన కట్టుబడి ఉన్నాడు. భార్య లేకుండా తాను జీవితంలో ముందుకు వెళ్లలేనంటూ మరణించిన ఆమె భౌతిక దేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు. మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాకు చెందిన స్కూల్ టీచర్ ఓంకార్దాస్ మోగ్రే భార్యపై తన ప్రేమను ఇలా చాటుకున్నాడు.
బంధువులు, ఇరుగుపొరుగు వారు వారించినా ఓంకార్దాస్ వినిపించుకోకుండా ఇంట్లోనే ఆమె సమాధిని ఏర్పాటు చేసి పువ్వులతో అలంకరించాడు. భార్య మృతదేహం పక్కనే ఆయన నిద్రించేవాడని స్ధానికులు చెబుతున్నారు. 25 ఏండ్ల పాటు కాపురం చేసిన భార్య లేకుండా తన అడుగు ముందుకుపడదని ఓంకార్దాస్ చెబుతుండేవారు.
స్ధానికులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఓంకార్దాస్ వారిస్తున్నప్పటికీ లెక్కచేయని అధికారులు మృతదేహాన్ని వెలికితీశారు. ఓంకార్దాస్ భార్య రుక్మిణి మంగళవారం దిండోరి జిల్లా బిర్సాముండ స్టేడియానికి సమీపంలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె గత పదేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.