భువనేశ్వర్: ఒడిశాలోని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు (Dhiraj Sahu) నివాసాలతోపాటు ఆయనకు చెందిన మద్యం డిస్టిలరీలు, దాని అనుబంధ సంస్థలపై ఐటీ సోదాలు ముగిశాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు పదిరోజులపాటు కొనసాగిన తనిఖీల్లో రూ.351 కోట్ల నగదు, మూడు కిలోల బంగారం పట్టుబడింది. దేశంలో ఇప్పటివరకు పట్టుబడిన నగదు నిల్వల్లో ఇదే పెద్ద మొత్తం కావడం విశేషం. కాగా, ఐటీ దాడుల విషయమై ధీరజ్ సాహు తొలిసారిగా నోరువిప్పారు. పట్టుబడిన సొమ్ము తనది కాదని.. తమ కుటుంబానికి చెందిందన్నారు. తమది కుటుంబ వ్యాపారమని, అదంతా మద్యం అమ్మకాల ద్వారా వచ్చిందేనని చెప్పారు. ఆ డబ్బుతో కాంగ్రెస్కుగానీ, మరే రాజకీయ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.
‘ఐటీ రికవరీ చేసిందంతా లిక్కర్ కంపెనీలకు సంబంధించింది. మద్యం అమ్మకాల ద్వారా అది సమకూరింది. తాను ఆ వ్యాపారంలో లేను. ఆ డబ్బంత తనది కాదు. తన కుటుంబానికి, ఇతర కంపెనీలకు చెందింది. దానికి సంబంధించిన ప్రశ్నలన్నింటికీ తమ కుటుంబ సభ్యులు సమాధానం ఇస్తారు. సీజ్ చేసిన డబ్బంతా నల్ల ధనమా లేదా చట్టబద్ధమైనదా అని ఐటీ శాఖ చెబుతుంది’ అని సాహు చెప్పారు.
సాహూకు చెందిన బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్తోపాటు దాని అనుబంధ సంస్థల్లో ఈ నెల 6న ఐటీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. రాంచిలోని సాహు కుటుంబంతోపాటు డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లు, కంపెనీల్లోనూ తనిఖీలు చేశారు. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్లోని 30 నుంచి 40 చోట్ల దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.351 కోట్ల నగదుతోపాటు మూడు కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సందర్భంగా పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి సేకరించిన డాటాను తమవెంట తీసుకెళ్లారు.